సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు.. ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ మేరకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం
  • పెండింగ్‌లో ఉన్న 92,000 కేసులను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం
  • 1956 నాటి న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి సవరణ
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఆర్డినెన్స్‌పై ఆమోదముద్ర వేయడంతో ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది.

సుప్రీంకోర్టులో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ద్వారా కేసుల విచారణను వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఈ ఆర్డినెన్స్ ద్వారా 'సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టం, 1956'లోని సెక్షన్ 2ను సవరించారు. దీని ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కాకుండా ఇతర న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెరిగింది. దీంతో సీజేఐతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరింది.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగనందున, రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి చట్టరూపం కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో ఏర్పడిన నాలుగు అదనపు న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు కొలీజియం త్వరలో పేర్లను సిఫార్సు చేసే ప్రక్రియను ప్రారంభించనుంది.

Droupadi Murmu
Supreme Court
Judges
India
Ordinance
Pending Cases
Ashwini Vaishnaw
Collegium

More Telugu News